అమరావతి: కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాల్లో వచ్చే ఉగాది నుంచి పరిపాలన ప్రారంభించనున్నారు. ఈ మేరకు కొత్తగా ఏర్పాటుచేసే జిల్లా కేంద్రాల్లో పరిపాలనకు సంబంధించి కార్యాలయాల ఏర్పాటు, అధికారుల నియామకం వంటి పనులపై ఇప్పటికే ప్రభుత్వం దృష్టిసారించింది. ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో కార్యకలాపాలు ప్రారంభమవుతాయని ఇవాళ గవర్నర్ బిష్వభూషణ్ హరిచందన్ సూత్రప్రాయంగా తన రిపబ్లిక్ డే ప్రసంగంలో పేర్కొనడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో పరిపాలనా సౌలభ్యం కోసం ప్రస్తుతం ఉన్న జిల్లాలను 26 జిల్లాలకు మారుస్తూ ఏపీ మంత్రిమండలి ఏకగ్రీవంగా తీర్మానించింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ను ప్రభుత్వం వెలువరించింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 26 జిల్లాలు ఏర్పాటుకానున్నాయి. ఈ జిల్లాల్లో పరిపాలనను ఉగాది నుంచి ప్రారంభించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ, మెరుగైన పౌర సేవలను అందించడం కోసం రాష్ట్ంలో కొత్తగా 13 జిల్లాలు ఏర్పాటు చేశారు. కాగా, కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో ఏవైనా అనుమానాలు, అభ్యంతరాలు ఉంటే నెల రోజులలోగా సంబంధిత అధికారిని కలిసి విన్నవించాలని ప్రభుత్వం తన నోటిఫికేషన్లో పేర్కొన్నది.
మరోవైపు కొత్త జిల్లాల ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ డివిజన్లు కూడా పెరిగాయి. ప్రస్తుతం కోస్తా, రాయలసీమ జిల్లాల్లో 50 రెవెన్యూ డివిజన్లు ఉండగా, వైసీపీ ప్రభుత్వం కొత్తగా మరో 13 రెవెన్యూ డివిజన్లను ప్రతిపాదించింది.