Chinta Mohan | ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని తెలిపారు. 130 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇక చిరంజీవిపై కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
చిరంజీవి ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని చింతా మోహన్ స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆయనకు ప్రాథమిక సభ్యత్వం ఉందని తెలిపారు. ఏపీలో ఎన్నికల సమయం వచ్చిందని.. చిరంజీవి మంచి నిర్ణయం తీసుకోవాలని కోరారు. తిరుపతి నుంచి చిరంజీవిని గెలిపించుకుంటామని అన్నారు. ఆ తర్వాత ముఖ్యమంత్రిని కూడా చేస్తామని వ్యాఖ్యానించారు. ఇదే విషయంపై కాంగ్రెస్ అధిష్ఠానంతో మాట్లాడతానని తెలిపారు. ఇక జగన్ ప్రభుత్వంపైనా చింతా మోహన్ విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ చర్యల కారణంగానే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు వైసీపీకి దూరమయ్యారని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ముస్లింలు, క్రిస్టియన్లు కాంగ్రెస్ పార్టీవైపు చూస్తున్నారని అన్నారు. అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించే స్థాయి ఆయనకు లేదని విమర్శించారు.