అమరావతి : పేదలపై దౌర్జన్యాలు జరిగితే తీవ్రవాద ఉద్యమాలే వస్తాయని జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ అన్నారు. జనసేన భరోసా కార్యక్రమంలో భాగంగా విజయవాడలో ఇవాళ రెండో విడత జనవాణిని ఆ పార్టీ ఎంబీకే భవన్లో ప్రజల నుంచి వచ్చిన ఆర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల కోసం ఒక ప్రభుత్వం స్థలాలు ఇస్తే మరో ప్రభుత్వం వాటిని అడ్డుకోవడం దారుణమని అన్నారు.
నాయకుడు ఏం చేస్తాడో కిందిస్థాయి నాయకుడు కూడా అదేరకంగా చేస్తారని వైఎస్ జగన్పై పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. ‘ యథా రాజా తథా ప్రజా’ మాదిరిగా వైసీపీకి చెందిన ఎంపీటీసీ రేణిగుంటలో పేదల ఇళ్లను కబ్జాచేసి దౌర్జన్యానికి పాల్పడడం బాధకరమని అన్నారు. లంచాలు తీసుకునే నాయకుడి లక్షణాలు గ్రామస్థాయి నాయకుల వరకు వెళ్లిపోతే అక్కడ మినీ వైఎస్సార్సీపీ అధినాయకుడే ఉంటాడని విమర్శించారు. వైసీపీ ఎంపీటీసీ లాక్కున్న పేదరాలి ఇంటిని వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు స్పందించి తిరిగి బాధితురాలికి ఇప్పించాలని కోరారు.
అధికారం ఉందని ఇష్టం వచ్చినట్లు దౌర్జన్యాలు చేస్తే ప్రజల ఆగ్రహాన్ని తట్టుకోలేరని పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం మా వంతు కృషి చేస్తామని అన్నారు. ప్రతి అర్జీని సంబంధిత శాఖ ల అధికారులకు పంపుతున్నామని వివరించారు. ప్రజలపై జరిగే అన్యాయాలను కలిసి ఎదురించాలని తెలిపారు.