అమరావతి : దివంగత ముఖ్యమంత్రి కొటిజేటి రోశయ్య అందరికీ ఆదర్శప్రాయుడుగా నిలిచారని ఏపీ సీఎం జగన్ అన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా దివంగత సభ్యులకు నిర్వహించిన సంతాప తీర్మానంలో జగన్ మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఐదుగురు ముఖ్యమంత్రుల వద్ద సమర్ధవంతమైన మంత్రిగా, ముఖ్యమంత్రిగా పనిచేసి రాష్ట్రానికి ఎనలేని సేవలందించారని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఆర్థిక శాఖ మంత్రిగా రోశయ్య పనిచేసిన సమయంలో వారిద్దరి మధ్య సత్ససంబంధాలు ఉండేవని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ మాజీ సభ్యులు వల్లూరి నారాయణమూర్తి, వీవీఎస్ఎస్ చౌదరి, కడప ప్రభాకర్ రెడ్డి, మంగమూరి శ్రీధర్ కృష్ణారెడ్డి, గారపాటి సాంబశివరావు , టీఎన్ అనసూయమ్మ, పి వేణుగోపాలరెడ్డి, ఎల్లసిరి శ్రీనివాసులరెడ్డి, యడ్లపాటి వెంకటరావు మృతికి ఏపీ అసెంబ్లీ సంతాపం ప్రకటించింది.
మృతుల ఆత్మకు శాంతి కలగాలని , వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుబూతిని తెలియజేసింది. మాజీ సభ్యుల మృతికి సంతాప సూచకంగా శాసనసభలో రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. గవర్నర్ ప్రసంగంపై చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. గవర్నర్ ప్రసంగం సందర్భంగా టీడీపీ ప్రవర్తించిన తీరును ఆయన ఖండించారు.