అమరావతి : ఐటీ అధికారులమంటూ ఓ బంగారు ఆభరణాల దుకాణంలోకి వెళ్లి హల్చల్ సృష్టించిన ముఠాను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించిన ఘటన నెల్లూరు జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. కాకర్లవారి వీధిలో ఉన్న లావణ్య జ్యువెలర్స్లో భారీ చోరీకి స్కెచ్ వేసిన దొంగలు పన్నాగం పారక కటకటాల పాలయ్యారు. సుమారు 6 గురు సభ్యులు గల ముఠా దర్జాగా కారులో వచ్చి తాము ఐటీ అధికారులమంటూ దుకాణంలో చొరబడ్డారు.
దుకాణానికి సంబంధించిన లావాదేవీల పుస్తకాలు చూపించాలని బెదిరించారు. వాటిని యజమాని చూపించే ప్రయత్నం చేసినప్పటికీ ససేమిరా పట్టించుకోకుండా దుకాణంలో ఉన్న 12 కిలోల బంగారాన్ని మూట కట్టుకున్నారు. ఐటీ అధికారులు వ్యవహరించే విధంగా కాకుండా భిన్నంగా ఉండడంతో అనుమానం వచ్చి నిలదీయగా స్పష్టమైన సమాదానం చెప్పకుండా దాటవేసే ప్రయత్నం చేశారు.
చివరకు వారిని ఒక గదిలో బంధించి మూడవ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అక్కడికి చేరుకుని ముఠా సభ్యులను అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్కు తరలించారు.