అమరావతి : అగ్నిపథ్కు వ్యతిరేకంగా ఆర్మీ అభ్యర్థులు నిర్వహిస్తున్న హింసాత్మక ఆందోళనలు జరుగకుండా ఏపీలో రైల్వే పోలీసులు, రాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆంధ్రప్రదేశ్లోని పలు కీలక రైల్వే స్టేషన్ల వద్ద భారీగా మోహరించి భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా విజయవాడలో హైఅలర్ట్ను ప్రకటించారు. స్టేషన్ల పరిసరాల్లో ఎవరూ గుమికూడకుండా పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. గుంటూరు, కడప , నరసరావుపేట, బాపట్ల స్టేషన్లలో రైల్వే రక్షణ దళాలు భద్రతను పెంచాయి .
పోలీసు ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ బలగాల మోహరింపునకు చర్యలు తీసుకుంటున్నారు. ఆర్మీ రిక్రూట్మెంట్ను యథాతథంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆందోళనకారులు బీభత్సం సృష్టించారు. ఆందోళనకు దిగిన యువత విధ్వంసానికి పాల్పడి ప్లాట్ఫామ్లపై ఉన్న దుకాణాల్లో వస్తువులు, ఫర్నీచర్ను ధ్వంసం చేశారు. రైళ్ల బోగీలకు నిప్పటించడంతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పరిసిర ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.