అమరావతి: ఆంధ్రప్రదేశ్ను భారీ వర్షాలు (Rains) ముంచెత్తాయి. వాయుగుండం ప్రభావంతో రాయలసీమలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం శుక్రవారం త్లెవారుజామున 3 నుంచి 4 గంట మధ్య పుదుచ్చేరి-చెన్నై మధ్య తీరం దాటింది. దీనిప్రభావంతో రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దక్షిణ కోస్తాంధ్రలో వానలు పడుతున్నాయి. దీంతో తీరప్రాంత ప్రజలకు అధికారులు అప్రమత్తం చేశారు.
చిత్తూరు, కడప, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోస్తాంధ్రలో చాలాచోట్ల మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. వర్షాల ప్రభావంతో తిరుమల రెండో కనుమ రహదానికి టీటీడీ మూసివేసింది. రెండో కనుమ దారిలో పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో మొదటి కనుమ దారిలో మాత్రమే భక్తులను అనుమతిస్తున్నది.
చిత్తూరు జిల్లాలో ఎడతెరపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జిల్లావ్యాప్తంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. తిరుపతిలో చాలా ప్రాంతాలు నీటమునిగాయి. దీంతో వరద బాధితులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కల్యాణి జలాశయానికి వరద నీరు పోటెత్తింది. దీంతో అధికారులు ప్రాజెక్టు మూడు గేట్లను ఎత్తివేశారు. శ్రీకాళహస్తిలో స్వర్ణముఖి నది ఉద్ధృతంగా ప్రవహిస్తున్నది.