అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాను అసనీ (Cyclone Asani) తీరాన్ని తాకింది. ఆంధ్రప్రదేశ్లోని చీరాల, బాపట్ల మధ్య తీరాన్ని తాకి కాకినాడ, విశాఖపట్నం వైపు దిశను మార్చుకున్నది. దీంతో గురువారం నాటికి బలహీనపడి అల్పపీడనంగా మారుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని తెలిపారు.
తుఫాను ప్రభావంతో కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కోనసీమ, విశాఖపట్నం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తుందని తెలిపారు. తుఫాను దృష్ట్యా తీర ప్రాంతాల్లో 95 నుంచి 105 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొన్నారు.
#WATCH Andhra Pradesh | Visuals from Kakinada – Uppada Beach road as rough sea conditions increase with strong winds due to #CycloneAsani pic.twitter.com/kqw394Mj86
— ANI (@ANI) May 11, 2022
తుఫాను ప్రభావంతో కాకినాడలో భారీగా వర్షం కురుస్తున్నది. కాకినాడ తీరంలో సముద్రం అల్లకల్లోలంగా ఉన్నది. విశాఖపట్నం భారీ వర్షం పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. దీంతో విశాఖ మీదుగా వెళ్లే రైళ్లను అధికారులు మళ్లించారు. అదేవిధంగా విశాఖ నుంచి బయలుదేరే విమాన సర్వీసులను ఇప్పటికే రద్దుచేశారు.