తిరుపతి : అవయవదానం వల్ల మరొకరి జీవితం ప్రసాదించవచ్చని నిరూపించారు తిరుపతి(Tirupati) లోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయం (Sri Padmavathi Children’s Heart Hospital ) వైద్యులు. ఈ సందర్భంగా వైద్యులు 12వ గుండె మార్పిడి శస్త్ర చికిత్సను ఆసుపత్రిలో విజయవంతం చేయడంతో టీటీడీ ఈవో ధర్మారెడ్డి (TTD EO) వైద్యులకు అభినందనలు తెలిపారు.
శ్రీకాకుళం జిల్లా రాజోలుకు చెందిన కె.ధర్మారావు(28) రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడడంతో అక్కడి జెమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే, ఆ యువకుడికి బ్రెయిన్ డెడ్(Brain dead) గా వైద్యులు గుర్తించారు. సదరు యువకుడి అవయవాలను దానం చేసేందుకు తల్లిదండ్రులు అంగీకరించడంతో ఇతర ఆసుపత్రులకు సమాచారం అందించారు.
వైజాగ్కు చెందిన 42 ఏళ్ల వ్యక్తి డైలేటెట్ కార్డియోమయోపతి వ్యాధితో గుండె పోటుకు గురయ్యే స్థితిలో తిరుపతిలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయంలో చికిత్స పొందుతున్నాడు. అవయవదానం సమాచారం అందుకున్న శ్రీ పద్మావతి హృదయాలయం డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథరెడ్డి వెంటనే ఉన్నతాధికారులను సంప్రదించి గుండె మార్పిడికి(Heart transplant ) ఏర్పాట్లు చేశారు.
ఫిబ్రవరి 26న సాయంత్రం 6 గంటలకు వైద్యబృందం గుండెను సేకరించి ప్రత్యేక ఏర్పాట్లతో శ్రీకాకుళం రాజోలు నుంచి గ్రీన్ ఛానల్(Green Channel) ద్వారా రోడ్డు మార్గంలో వైజాగ్కు చేరుకున్నారు. అక్కడి నుంచి రాత్రి 8 గంటలకు ప్రత్యేక విమానంలో బయల్దేరి రాత్రి 10.05 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానశ్రయం నుంచి రాత్రి 10.05 గంటలకు బయల్దేరి రాత్రి 10.25 గంటలకు శ్రీ పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రికి తరలించి ఈనెల 27న తెల్లవారుజామున 4 గంటలకు గుండె మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు.