అమరావతి: ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున స్వాతంత్య్రదినోత్సవాన్ని జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే నెల 13 నుంచి 15 వరకు మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా 1.62 కోట్ల మువ్వన్నెల జెండాలను ఆవిష్కరించేందుకు ఏపీ సర్కార్ సిద్ధమైంది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జరిపిన వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా వెల్లడించారు. దేశభక్తి భావనను పెంపొందించడమే ముఖ్యోద్దేశంగా ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తున్నది.
అన్ని ప్రభుత్వ భవనాలు, అధికారిక క్వార్టర్లుతోపాటు గ్రామ, వార్డు సచివాలయాలతో పాటు సిబ్బంది, వాలంటీర్ల ఇళ్లపైనా జాతీయ జెండా రెపరెపలాడేలా ఏపీ సర్కార్ చర్యలు తీసుకుంటున్నది.
రాష్ట్రంలోని 5.24 లక్షల రేషన్ దుకాణాలతోపాటు అన్ని పారిశ్రామిక గృహాలు, దుకాణాలు, సంస్థలు, నివాస కాలనీలపై జెండా ఎగురవేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1.62 కోట్ల జాతీయ పతాకాలు ఎగురవేసేందుకు ప్రబుత్వం చర్యలు తీసుకుంటున్నది.
ఈ సందర్భంగా ప్రజల్లో దేశభక్తి, జాతీయవాదాన్ని పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తారని, ఇళ్లపై ఎగురవేయడానికి వీలుగా వారికి జెండాలు అందజేయనున్నట్లు అధికారులు చెప్పారు.