పూర్తి వివరాలతో త్వరలో టీటీడీ పుస్తకం
హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి కొలువైన తిరుమలక్షేత్రం ఇకపై హనుమంతుడి జన్మస్థానంగానూ గుర్తింపు పొందనున్నది. 13న ఉగాది రోజున ఈ విషయాన్ని శాస్త్రీయఆధారాలతో నిరూపించేందుకు టీటీడీ సిద్ధమైంది. గురువారం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో ఈవో కేఎన్ జవహర్రెడ్డి ఈ విషయంపై నిపుణుల కమిటీ సభ్యులతో సుదీర్ఘంగా సమీక్షించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ.. కమిటీలోని పండితులు జ్యోతిషశాస్త్రం, శాసనాలు, పురాణాలు శాస్త్రీయఆధారాలతో ఉగాదిరోజున ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేస్తారని వివరించారు. హనుమంతుడి జన్మస్థానం అంజనాద్రి అని నిరూపించేందుకు ఉన్న ఆధారాలు, ఇతర వివరాలతో త్వరలో పుస్తకాన్ని తీసుకొస్తున్నట్టు తెలిపారు. అంజనాద్రి కొండలో హనుమంతుడు జన్మించాడనే విషయాన్ని ఆధారాలతో సహా నిరూపించేందుకు 2020 డిసెంబర్లో టీటీడీ పండితులతో కమిటీని ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీ శివ, బ్రహ్మ, బ్రహ్మాండ, వరాహ, మత్స్యపురాణాలు, వేంకటాచల మహత్యం గ్రంథం, వరాహమిహిరుడి బృహత్సంహిత గ్రంథాల ప్రకారం వేంకటేశ్వరస్వామి చెంతన ఉన్న అంజనాద్రి కొండే ఆంజనేయుడి జన్మస్థానమని.. యుగం, తేదీ ప్రకారం నిర్ధారణకు వచ్చారు.