విజయవాడ: బీజేపీ ఏపీ శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజుపై కేసు నమోదు చేయడం అన్యాయమని బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోనసీమలో ఓ కార్యకర్త ఇంటికి సోము వీర్రాజు వెళ్లడం నేరమా? అని జీవీఎల్ నరసింహారావు తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ప్రశ్నించారు.
సోము వీర్రాజును అడ్డుకోవడం అప్రజాస్వామికమని, ఆయనపై కేసు నమోదు చేయడాన్ని ఖండిస్తున్నామని జీవీఎల్ అన్నారు. తమ రాజకీయ కార్యకలాపాలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎలా అడ్డుకుంటుంది అని ప్రశ్నించారు. రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం బీజేపీ కార్యకలాపాలను అనుమతించడం లేదని, వైసీపీ ప్రభుత్వాన్ని విడదీసి బీజేపీ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని నడ్డా చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా జీవీఎల్ గుర్తుచేశారు.
కాగా, బుధవారం ఉదయం తూర్పుగోదావరి జిల్లాకు బయల్దేరిన సోము వీర్రాజును జొన్నాడ జంక్షన్లో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ విధుల్లో ఉన్న ఎస్ఐపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయనను నెట్టివేసినంత పని చేశారు. ఈ నేపథ్యంలో సోము వీర్రాజు తన విధులకు ఆటంకం కలిగించారని సదరు ఎస్ఐ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో సోము వీర్రాజుపై ఐపీసీ సెక్షన్ 353, 506 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.