తిరుమల: తిరుమల కొండపైకి కాలినడకన వచ్చే భక్తులకు టీటీడీ గ్రీన్ కార్పెట్ను ఏర్పాటు చేసింది. అలిపిరి నుంచి తిరుమలకు నడచి వచ్చే భక్తులు ఎండ వేడితో కాళ్లు కాలుతూ పడుతున్న ఇబ్బందులు చూసి చలించిన టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి యుద్ధప్రాతిపదికన గ్రీన్ కార్పెట్ ఏర్పాటుచేయించారు.
చైర్మన్ తిరుమల నుంచి తిరుపతికి వస్తున్న సమయంలో నడక దారిలోని మోకాలి మిట్ట నుంచి అక్కగార్ల గుడివరకు భక్తులు కాళ్లు కాలుతూ పడుతున్న ఇబ్బందులను చూశారు.
భక్తులతో మాట్లాడి వారి ఇబ్బందిని తెలుసుకున్నారు. నడక మార్గం లోని మోకాలి మిట్ట నుంచి అక్కగార్ల గుడి మలుపు వరకు వెంటనే గ్రీన్ మ్యాట్ వేయించి నీరు చల్లించే ఏర్పాటు చేయాలని ,24 గంటల్లో పని పూర్తి చేసి తనకు సమాచారం ఇవ్వాలని చీఫ్ ఇంజినీరింగ్ నాగేశ్వరరావును ఆదేశించారు. ఈ మార్గంలో గ్రీన్ కార్పెట్ ఏర్పాటు చేసి దాని మీద నీళ్లు చల్లించే ఏర్పాటు చేశారు. సామాన్య భక్తుల సదుపాయాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని చైర్మన్ చెప్పారు.
వేసవిలో భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో నడక మార్గాలు, తిరుమలలో భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించామని ఆయన వెల్లడించారు.