Srisailam | శ్రీశైల మహా క్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అమంగళాలను తొలగించి భోగభాగ్యలను అందించే భోగి మంటలతో సంప్రదాయ ఘట్టంతో ఆదివారం తెల్లవారు జాము నుండి మూడవరోజు ఉత్సవాలను జరుపుకుంటున్నట్లు ఈఓ పెద్దిరాజు తెలిపారు. అలాగే పండుగ నాడు క్షేత్రానికి వచ్చే భక్తులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలలో భాగంగా మూడవరోజు సాయంత్రం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మ వార్లు రావణ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. అక్కమహాదేవి మండపంలో ఉత్సవ మూర్తులను రావణ వాహనంపై వేంచేబు చేసి ప్రత్యేక పూజాధికాలు నిర్వహించారు. అటుపై డప్పు చప్పుళ్లు, మేళతాళాలతో కళాకారుల సంప్రదాయ నృత్యాల నడుమ గ్రామోత్సవం నిర్వహించారు. రావణవాహనంపై విహరించిన స్వామి అమ్మవార్లను వీక్షించేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
చెంచులలో అనాదిగా వస్తున్న సాంప్రదాయం ప్రకారం సంక్రాంతి జరగాల్సిన స్వామి అమ్మవార్ల దొంగ పెళ్లిని దేవస్థానం ఘనంగా చేయిస్తుందని ఈఓ పెద్దిరాజు తెలిపారు. చెంచుల ఆడపిల్లగా భావించే భ్రమరాంబ అమ్మవారిని వెతుక్కుంటూ వచ్చిన మల్లికార్జునుడికి అమ్మవారితో ప్రేమానుబంధం ఏర్పడింది. భ్రమరాంబ అమ్మవారిని మల్లికార్జునుడు వివాహం చేసుకోవాలనుకుంటాడు.
ఇందుకు పెద్దలు అంగీకరించక పోవడంతో పెద్దలను కాదని అమ్మవారిని అపహరించుకుపోయి మకర సంక్రాంతి రోజు దొంగ పెళ్లి చేసుకున్నాడని విశ్వసిస్తూ అనాదిగా చెంచులలో వస్తున్న సంప్రదాయాన్ని దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు ఈవో తెలిపారు. సోమవారం రాత్రి జరిగే పార్వతీ కళ్యాణానికి ప్రత్యేక ఆహ్వానంతో క్షేత్ర పరిసరాల్లో ఉండే 150 చెంచు గూడెంల నుండి గిరిపుత్రులు హాజరవుతారని తెలిపారు.