అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం అమరావతిలో అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాజధానిలో విడతల వారీగా అభివృద్ధి పనులు చేపట్టాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. హైకోర్టు ఆదేశాల మేరకు అసంపూర్తిగా ఉన్న పనులను దశల వారీగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో రాజధాని ప్రాంతంలో వివిధ అభివృద్ది పనులను సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ ప్రారంభించారు.
అమరావతి ప్రాంతంలోని పిచుకులపాలెం, అనంతవరం, దొండపాడు, తుళ్లూరు మధ్య రైతులకు ఇచ్చిన ప్లాట్లలో అభివృద్ధి పనులను తొలుత చేపట్టనున్నారు. ఈ నాలుగు గ్రామాల పరిధిలోని దాదాపు 4 వేల ప్లాట్లలో ఉన్న కంప చెట్లను తొలగిస్తున్నారు. రూ.132 కోట్ల నిధులతో 63 కిలోమీటర్ల మేర రహదారులను అభివృద్ధి చేయనున్నారు. ప్రాధాన్యం మేరకు రహదారులు, విద్యుత్తు స్తంభాల ఏర్పాటు, తాగునీరు, వరద నీటి కాలువల నిర్మాణం వంటి వాటిపై దృష్టి సారిస్తున్నారు. ఇవి ఒక కొలిక్కి వచ్చాక మిగిలిన ప్యాకేజీల పనులు కూడా ప్రారంభించేందుకు అధికారులు ఆలోచిస్తున్నారు.
రాజధాని ప్రాంతంలో అధికారులు, ప్రజా ప్రతినిధుల నివాస సముదాయాలను నవంబర్కల్లా పూర్తి చేస్తామని సీఆర్డీఏ కమిషనర్ వివేక్ వెల్లడించారు. రైతులకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని చెప్పారు. ఇలా ఉండగా, అసైన్డ్ రైతులకు కౌలు చెక్కులు ఇవ్వాలంటూ ఉద్ధండరాయునిపాలెంకు చెందిన ఓ రైతు కమిషనర్ కాళ్లపై పడి ప్రాధేయపడ్డాడు. దానికి స్పందించిన కమిషనర్.. అసైన్డ్ రైతుల సమస్యలను పరిష్కరిస్తామని, త్వరలోనే కౌలు చెక్కులు అందజేస్తామని భరోసా ఇచ్చారు.