అమరావతి : తమ డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీలు నిర్వహిస్తున్న సమ్మెను విరమించేందుకు ప్రభుత్వం అంగన్వాడీ సంఘాల(Anganwadi) తో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. మంగళవారం సాయంత్రం మంత్రుల కమిటీ అంగన్వాడీ సంఘాల ప్రతినిధులను చర్చలకు పిలిచింది. దాదాపు నాలుగు గంటల పాటు చర్చలు జరిగాయి. ప్రస్తుతం వేతనాలు పెంచే స్థితిలో ప్రభుత్వం లేదని మంత్రుల కమిటీ స్పష్టం చేసింది.
తమ డిమాండ్లను ఒప్పకోకపోవడం వల్ల ఆందోళనలు కొనసాగించాలని నిర్ణయించామని అంగన్వాడీ నాయకులు వెల్లడించారు. రేపటి నుంచి ఎమ్మెల్యేల ఇళ్ల వద్ద ధర్నాలు చేస్తామని ప్రకటించారు. ఇప్పటి వరకు తమ డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకెళ్లకపోవడం విచారకరమని వారు అన్నారు. గత 15 రోజులుగా రోడ్లపై ఆందోళనలు చేస్తున్నా పట్టించుకోలేదని ఆరోపించారు. తమకు గౌరవ వేతనం పేరుతో వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
సార్వత్రిక ఎన్నికల తరువాత జీతాల పెంపును ఆలోచిస్తా్ం : మంత్రి బొత్స
సార్వత్రిక ఎన్నికల తరువాత జీతాల పెంపుపై యోచిస్తామని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ(Minister Botsa Satyanarayana) వెల్లడించారు. సంక్రాంతి తరువాత మరోసారి చర్చిద్దామని అంగన్వాడీ ప్రతినిధులకు వివరించామని తెలిపారు. తమది మహిళ పక్షపాత ప్రభుత్వమని పేర్కొన్నారు. వేతనాల పెంపునకు సమయం కావాలని కోరామని ఆయన మీడియాకు వివరించారు. ఈ చర్చల్లో ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.