అమరావతి : వరద బాధితులను ఆదుకోవడం విషయంలో ప్రభుత్వ తీరు దారుణంగా ఉందని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. వరద బాధితులను ఆదుకోవడం కోసం తెలంగాణలో ఒక్కో కుటుంబానికి రూ. 10 వేలు ఇస్తుంటే ఏపీలో రూ. 2 వేలు ఇవ్వడం సిగ్గు చేటుగా ఉందని ఆయన అన్నారు. బాధితులకు అండగా నిలవాల్సింది పోయి ప్రతిపక్షాలను విమర్శించడమే పనిగా పెట్టుకుందని ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు.
ప్రభుత్వం చేతకాని తనం వల్ల విలీన గ్రామాల ప్రజలు ఏపీలో ఉండలేమంటున్నారని పేర్కొన్నారు. పాఠశాల విలీనం ద్వారా రాష్ట్రంలో డ్రాప్ ఔట్స్ పెరుగుతారని తెలిపారు. రుషికొండ విషయంలో సుప్రీం తీర్పునూ ఏపీ ప్రభుత్వం పట్టించుకోని పరిస్థితి ఉందని వెల్లడించారు. వైసీపీ పాలనలో అన్ని వర్గాలు ఇబ్బందులు పడుతున్నాయని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ఓట్లు కొనాలనే ఆలోచనలతో వైసీపీ ఉందని విమర్శించారు. రాష్ట్ర భవిష్యత్ కోసం ప్రజలు ఆలోచించాలని ఆరోపించారు.