తిరుమల : తిరుమలలో ( Tirumala ) శ్రీవారి సేవ నాణ్యతను మెరుగుపరిచి భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో టీటీడీ (TTD ) అధికారులు ముఖ్యమైన మార్పులు చేశారు. ఈ మార్పులు బుధవారం నుంచే అమలులోకి వచ్చాయి. టీటీడీ సభ్యులు కొందరు శ్రీ సత్యసాయి సేవా సంస్థ (పుట్టపర్తి), ఇషా ఫౌండేషన్ (కోయంబత్తూర్), ఆర్ట్ ఆఫ్ లివింగ్ (బెంగళూరు) వంటి ప్రఖ్యాత సంస్థలను సందర్శించి అక్కడ అందుతున్న సేవలను అధ్యయనం చేశారు.
ఈ అధ్యయనం ఆధారంగా శ్రీవారి సేవలో కొన్ని ముఖ్యమైన మార్పులను టీటీడీ తీసుకొచ్చింది. గత రెండు సంవత్సరాలుగా పదవీ విరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగులు ( Retired Employees) సేవలో పాల్గొంటుండగా ఇక 45 సంవత్సరాలు నుంచి 70 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారు శ్రీవారి సేవ కోసం తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. వీరిని ‘గ్రూప్ లీడర్స్’ (Group Leaders ) గా పిలుస్తామని అధికారులు తెలిపారు.
సేవలో పాల్గొనే వారు 15 రోజులు, నెలా, లేదా మూడు నెలల వ్యవధిలో సేవ చేయడానికి ఆన్లైన్లో ఎంపిక చేసుకోవచ్చని వెల్లడించారు. గ్రూప్ లీడర్స్ శ్రీవారి సేవకుల పనిని పర్యవేక్షించడం, సేవకు వారి హాజరు తీసుకోవడం, ప్రతి ఒక్క సేవకుని, సేవకురాలి పనితీరును మూల్యాంకనం చేయడం వంటి బాధ్యతలు నిర్వహిస్తారని చెప్పారు.
పరకామణి సేవలో జనరల్ పురుష సేవకులకు అవకాశం
కనీసం పదో తరగతి విద్యార్హత కలిగిన పురుషులకు పరకామణి సేవలో పాల్గొనేందుకు అవకాశం కల్పించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ మేరకు ఆన్ లైన్ ద్వారా పరకామణి సేవను బుక్ చేసుకోవచ్చని వెల్లడించింది.