అమరావతి : ఆంధ్రప్రదేశ్ రైల్వే ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త తెలిపింది. ఏపీలో పలు ప్రాంతాల మధ్య నడిచే ఏడు రైళ్లను జులై మాసం నుంచి పునరుద్ధరించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. కొవిడ్ ప్రభావం వల్ల నిలిపివేసిన రైళ్లను తిరిగి నడిపించడానికి ముహుర్తం ఖరారు చేసింది. తిరుపతి నుంచి కాడ్పాటి మధ్య నడిచే రైలును జులై 11 నుంచి పునరుద్ధరించనున్నారు. ప్రతిరోజు ఉదయం 10.55 నిమిషాలకు తిరుపతి నుంచి బయలు దేరి మధ్యాహ్నం 1.30 గంటలకు కాట్పాడి రైల్వే స్టేషన్కు చేరుకుంటుందని వెల్లడించారు.
కాట్పాడి నుంచి తిరుపతికి వెళ్లే రైలు జులై 11 నుంచి ప్రతిరోజు రాత్రి 9.55 గంటలకు కాట్పాడి నుంచి బయలుదేరి రాత్రి 11.50 గంటలకు తిరుపతికి చేరుకుంటుందని తెలిపారు. గుంటూరు నుంచి విజయవాడకు వెళ్లే రైలును జులై 18 నుంచి ప్రతిరోజు సాయంత్రం 5.45 గంటలకు గుంటూరు నుంచి బయలు దేరి రాత్రి 7 గంటలకు చేరుకుంటుందని వివరించారు. తెనాలి నుంచి గుంటూరు వెళ్లే రైలు అదే రోజు నుంచి మధ్యాహ్నం 3.45 గంటలకు తెనాలి నుంచి బయలు దేరి సాయంత్రం 4.40 కు గుంటూరు రైల్వేస్టేషన్కు చేరుకుంటుదన్నారు.
మార్కపూర్ రోడ్ నుంచి తెనాలి వెళ్లే రైలు జులై 18 నుంచి పునరుద్ధరించనున్నారు. ఈ రైలు ఉదయం 10.10 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2.45 నిమిషాలకు తెనాలి రైల్వేస్టేషన్కు చేరుకుంటుందన్నారు. ఇక నంద్యాలు నుంచి కడపకు వెళ్లే రైలును జులై 16 నుంచి పునరుద్ధరించానున్నారు. ఈ రైలు ఉదయం 5.50 గంటలకు బయలు దేరి 9.40 గంటలకు కడప రైల్వే స్టేషన్కు చేరుకుంటుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు వివరించారు.
అదేవిధంగా కడప నుంచి నంద్యాల్ వెళ్లే రైలును జులై 17 నుంచి పునరుద్ధరించనున్నామని తెలిపారు. ఈ రైలు సాయంత్రం 5.30 కడప నుంచి బయలు దేరి రాత్రి 9.30 గంటలకు నంద్యాల్కు చేరుకుంటుందని పేర్కొన్నారు.