శ్రీకాకుళం జిల్లా: ఇటీవల జిల్లాలో జరిగిన కేజీన్నర బంగారం చోరీ కేసును పోలీసులు చేధించారు. నలుగురు దొంగలను అదుపులోకి తీసుకుని వారి నుంచి కేజీన్నర బంగారం స్వాధీనం చేసుకున్నారు. పెద్ద మొత్తంలో నగదు, బంగారంతో ప్రయాణించేప్పుడు జాగ్రత్తగా ఉండాలని జిల్లా ఎస్పీ రాధిక సూచించారు.
జిల్లా ఎస్పీ రాధిక సోమవారం నాడు దొంగల అరెస్టుకు సంబంధించిన వివరాలు మీడియాకు వెల్లడించారు. శ్రీకాకుళం పట్టణం సమీపంలోని అంపోలు-ఆడవరం రహదారిలో నాలుగు రోజుల క్రితం బంగారం వ్యాపారస్తులను అటకాయించి వారి వద్ద ఉన్న 1,652 గ్రాముల బంగారాన్ని, 141 తులాల బంగారు నగలను దొంగలు దోచుకున్నారు. ఈ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు క్లూస్ టీం, ఫింగర్ ప్రింట్స్ టీంలను రంగంలోకి దింపి గాలింపు చేపట్టింది.
బంగారం చోరీ జరిగిన రోడ్డులోనే బంగారం వర్తకులు ఎక్కువగా వెళ్తుంటారని ముందుగానే పసిగట్టిన శ్రీకూర్మానికి చెందిన ఒక జ్యూయలర్ షాపు యజమాని చంద్రహర్ష.. ఈ దారి దోపిడీకి ప్లాన్ చేశాడు. చోరీలో ఇతడికి కసప రాజేశ్, హరి, లక్ష్మీనారాయణలు సహకరించారని పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి దొంగిలించిన మొత్తం సొత్తుతోపాటు ఆరు మొబైల్స్, రెండు బైకులను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ రాధిక తెలిపారు.