తిరుమల : కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈనెల 8న పౌర్ణమి గరుడసేవను తిరుమలలో ఘనంగా నిర్వహించ నున్నట్లు అధికారులు తెలిపారు. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారిని గరుడునిపై తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారని వివరించారు. ఈనెల 7 న తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల కార్తీక పర్వదీపోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
కార్తీక పౌర్ణమినాడు శ్రీవారికి సాయంకాల కైంకర్యాలు, నివేదనలు పూర్తి అయిన తరువాత ఈ దీపోత్సవం నిర్వహిస్తారన్నారు. ఈ సందర్భంగా సాయంత్రం 5 నుండి 8 గంటల వరకు నేతి వత్తులతో దీపాలను వెలిగించి ఛత్రచామర, మంగళవాయిద్యాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణం చేస్తూ, ఆనందనిలయంలో శ్రీవారికి హారతి ఇస్తారన్నారు. ఆతర్వాత వరుసగా గర్భాలయంలో అఖండం, కులశేఖరపడి, రాములవారిమేడ, ద్వారపాలకులు, గరుడాళ్వారు ఆలయంలో దీపాలను ఏర్పాటు చేయనున్నామని వివరించారు.
వరదరాజస్వామి సన్నిధి, వకుళమాత, బంగారుబావి, రంగనాయక మండపం, మహాద్వారం, బేడి ఆంజనేయస్వామి, శ్రీవరాహస్వామి ఆలయం, స్వామి పుష్కరిణి తదితర ప్రాంతాల్లో దీపాలను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో సహస్రదీపాలంకరణ సేవను రద్దు చేసినట్లు పేర్కొన్నారు.