నెల్లూరు జిల్లా : లాటరీలో కారు బహుమతిగా వచ్చిందంటూ ఓ యువతిని సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. వారి మాటలు నమ్మిన ఆమె తన ఫోన్ నుంచి రూ.59 వేలు వారి అకౌంట్కు పంపించారు. అనంతరం వారి ఫోన్ మూగబోవడంతో తాను మోసపోయానని సదరు యువతి నెల్లూరు జిల్లా ఆత్మకూరు పోలీసులను ఆశ్రయించారు.
బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఆత్మకూరు పట్టణంలోని పెదమర వీధి మసీదు ప్రాంతానికి చెందిన కిర్మాణి జమీర్ సోదరి హఫీజాకు ఇటీవల మహేంద్ర కంపెనీ కారు బహుమతిగా వచ్చినట్లు పోస్టు ద్వారా ఒక స్క్రాచ్ కార్డ్ వచ్చింది. వివరాల కోసం దయచేసి కార్డుపై ఉన్న ఫోన్ నంబర్లో సంప్రదించాలని సూచించారు. దాంతో పోస్ట్ కార్డ్లో పేర్కొన్న నంబర్ను సంప్రదించగా.. లాటరీలో కారు గిఫ్ట్గా గెలుచుకున్నారని చెప్పారు. అయితే, తనకు కారు వద్దని, బదులుగా నగదును ఇవ్వాలని సదరు యువతి కోరింది. అలా నగదు కావాలంటే రూ.14.59 లక్షలు ఇస్తామని, అందుకు రూ.14,800 పన్ను చెల్లించాలని కాల్ చేసిన మోసగాళ్లు చెప్పారు. దాంతో ఆ యువతి వారు చెప్పినట్లుగా వారు సూచించిన బ్యాంకు అకౌంట్లో తొలుత రూ.14,800 జమ చేసింది.
మరుసటి రోజు జీఎస్టీగా రూ.44,400 చెల్లించాలని మళ్లీ సైబర్ మోసగాళ్లు చెప్పడంతో తన ఫోన్ నంబరు నుంచి ఫోన్ పే ద్వారా వారు చెప్పినట్లుగా కోల్కతాలోని బ్యాంక్ ఖాతా నంబర్లో డబ్బులు జమ చేశారు. తర్వాత కారు గురించి తెలుసుకునేందుకు పలు మార్లు ఫోన్ చేసినా నిందితుడు కాల్ లిఫ్ట్ చేయలేదు. దాంతో తాము మోసపోయామని గ్రహించిన బాధితులు హఫీజా, ఆమె సోదరుడు జమీర్ ఆత్మకూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జిల్లా సైబర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.