అమరావతి : ఆంధ్రప్రదేశ్లో రైతుల వద్ద నుంచి చేస్తున్న ధాన్యం కొనుగోలులో ఘరానా మోసం జరుగుతుందని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఆరోపించారు. ఈ మోసాలపై విచారణ చేపట్టాలని ఏపీ సీఎం
జగన్కు ఇవాళ ఓ లేఖను రాశారు. ధాన్యం కోనుగోళ్ల వ్యవహారంలో అక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని మొదటి నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తున్నా కనీసం స్పందించడం లేదని విమర్శించారు. స్వయాన సొంత పార్టీకి చెందిన ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ధాన్యం మాఫియాపై చేసిన వ్యాఖ్యలకైనా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
75 కిలోల ధాన్యం బస్తాకు రూ. 1455 చెల్లించాల్సి ఉండగా రూ. 1200 కంటే తక్కువ చెల్లిస్తున్నారని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు కాకుండా మిల్లర్ల వద్దకు మొత్తం ధాన్యం వెళ్లే విధంగా క్షేత్రస్థాయిలో అధికారులు మౌఖిక ఆదేశాలు జారీ చేస్తున్నారని ఆరోపించారు. ఈ దోపిడి వెనుక ఉన్న వారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ధాన్యాన్ని రీమిల్లింగ్ చేసే మాఫియాపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.