కాశీ అన్నపూర్ణాదేవి క్షేత్రంలో లక్షమందికి అన్నదానం చేయగా వచ్చే ఫలితం శ్రీశైల మహా క్షేత్రంలో ఒక్కరికి భోజన ప్రసాదం పెట్టడం వలన కలుగుతుందని ఆధ్యాత్మిక ప్రవచనకర్త, పెదచింతరేవుల శ్రీఆంజనేయస్వామి దేవాలయ ప్రధానార్చకులు ఆద్యచక్రవర్తి కేశవాచార్యులు అన్నారు. శుక్రవారం శ్రీశైలంలోని వీరశైవ లింగాయత్ నిత్యాన్నసత్ర ప్రాంగణంలో శివస్వాములకు అన్నదానం చేశారు.
తెలంగాణలోని జోగుళాంబ గద్వాల్ జిల్లాకు చెందిన పెదచింతరేవుల శ్రీ ఆంజనేయస్వామి అన్నదాన ట్రస్ట్ ఆధ్వర్యంలో 30 వేల మందికి పైగా అన్నదానం చేసినట్లు శ్రీశైల పరిరక్షణ విభాగ్ అధ్యక్షుడు శివమల్లి తెలిపారు. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు వచ్చే యాత్రికులకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితిగా వస్తుందని అన్నారు. పది సంవత్సరాలుగా శ్రీఆంజనేయస్వామి దేవాలయ భక్తులతో పాటు పలువురు తెలంగాణ జిల్లాల దాతల సహాయంతో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు ట్రస్ట్ వ్యవస్థాపకులు పేర్కొన్నారు. అన్నదాన కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు పాండు, మల్లికార్జున, లక్ష్మిదేవమ్మ, రాజు, గోపాల్స్వామి తదితరులు పాల్గొన్నారు.