అమరావతి : ఏపీలో పర్యటించిన ప్రధాని పర్యటన సందర్భంగా నలుపు బెలూన్లను ఎగురవేసిన ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నామని కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా తెలిపారు. హెలికాప్టర్లో మోదీ గన్నవరం నుంచి భీమవరంకు బయలుదేరిన కొద్ది క్షణాల్లోనే విమానాశ్రయానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో బెలూన్లను ఎగురవేశారు. ఈ ఘటనను జిల్లా పోలీసులు సీరియస్గా తీసుకుని డీఎస్పీ నేతృత్వంలో విచారణ ప్రారంభించారు.
ఈ విచారణలో కాంగ్రెస్ పార్టీ పిలుపుమేరకు ఏఐసీసీ కార్యదర్శి రాజీవ్ రతన్ నేతృత్వంలో గన్నవరం సమీపంలోని ఓ బిల్డింగ్పై నుంచి బెలూన్లు వదిలారని తెలిపారు. రాజీవ్ రతన్తో పాటు పద్మశ్రీ , సావిత్రి, కిశోర్ బెలూన్లను ఎగురవేశారని గుర్తించినట్లు ఆయన తెలిపారు. బెలూన్లలో హైడ్రోజన్ లేదని, నోటితో ఊది ఎగరవేశారని వివరించారు.
ప్రధాని భద్రతలో సెక్యూరిటీ రిస్క్ లేదని, ఎస్పీజీ పోలీసులను వివరణ కోరలేదని స్పష్టం చేశారు. ఈ కేసుపై గన్నవరం పోలీసులు కేసు నమోదు చేశారు. పీసీసీ ప్రధాన కార్యదర్శి రాజీవ్రతన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.