అమరావతి : ఆంధ్రప్రదేశ్లో గోదావరి వరదముంపు ప్రాంతాల్లో వరద సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇవాళ వరద ముంపు ప్రాంతాల అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. పంట నష్టం, వరద ముంపు నష్టంపై అధికారులకు సూచనలు చేశారు. వరద నీరు క్రమంగా తగ్గుముఖం పడుతోందని వెల్లడించారు.
మరో 48 గంటల్లోగా ప్రతి ఇంటికీ రూ. 2వేలు ఇవ్వాలని , ప్రతి ఇంటికీ 25 కిలోల బియ్యం, నిత్యావసరాలు అందించాలని , సచివాలయం, వాలంటీర్ సేవలను వినియోగించుకోవాలని తెలిపారు. ప్రభుత్వం వద్ద నిధుల సమస్య లేదని స్పష్టం చేశారు. ముంపు ప్రాంతాల్లో పారిశుద్ధ్య సమస్య తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. వరద తగ్గగానే నష్టంపై అంచనా వేయాలని సూచించారు.
10 రోజుల్లోగా పంట, ఆస్తినష్టంపై అంచనా పూర్తి చేయాలన్నారు. గర్భిణుల పట్ల శ్రద్ధ వహించాలని, వారిని ఆస్పత్రులకు తరలించాలని పేర్కొన్నారు. కల్వర్టులు, వంతెనలకు త్వరగా మరమ్మతులు పూర్తి చేయాలని తెలిపారు. గోదావరి కట్టలు బలహీనంగా ఉన్న చోట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. విద్యుత్ పునరుద్ధరణ, మరమ్మతు పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని వివరించారు. కలెక్టర్లు, సీనియర్ అధికారులు బాధ్యత తీసుకోవాలని సూచించారు.