అమరావతి : ఎర్రచందనాన్ని అక్రమంగా తరలిస్తున్న ఐదుగురు స్మగర్లను కడప జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలోని సిద్ధవటం అటవీ ప్రాంతం నుంచి తరలిస్తున్న సుమారు 30 లక్షల రూపాయల విలువ గల ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ అన్బురాజన్ శుక్రవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
సిద్ధవటం పోలీస్స్టేషన్ పరిధిలో వాహనాలను తనిఖీ చేస్తుంటే అనుమానస్పదంగా రెండు కార్లను తనిఖీ చేయగా అందులో 16 ఎర్రచందనం దుంగలు పట్టుబడ్డాయని తెలిపారు. విచారించగా జిల్లాకు చెందిన బొడ్డే విశ్వనాథ్, ఈశ్వర్ అనే బడా స్మగ్లర్లతో పాటు వారికి సహకరిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. వీరి వద్ద నుంచి 500 కిలోల ఎర్రచందనం దుంగలు, నాలుగు వాహనాలు స్వాధీనం చేసుకున్నామని , పట్టుబడ్డ ఐదుగురు స్మగ్లర్లపై పీడీ యాక్టు కేసు నమోదు చేయనున్నామని ప్రకటించారు. వీరిని కోర్టులో ప్రవేశ పెట్టి అరెస్టు చేస్తామని వెల్లడించారు.
ఈ కేసులో మరి కొందరు ప్రమేయం ఉందని వారిపై కూడా కేసులు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టి పట్టుకుంటామని ఎస్పీ పేర్కొన్నారు.