విజయవాడ: ఆంధ్రప్రదేశ్లోని పరిటాలలో స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిజాం పాలన నుంచి స్వాతంత్య్రం పొందిన తొలి గ్రామంగా పరిటాల రికార్డులకెక్కింది. పూర్వపు కృష్ణా జిల్లాలో పరిటాల గ్రామం ఉన్నది. సెప్టెంబర్ 17 ను పురస్కరించుకుని శనివారం నిజాం పాలన నుంచి స్వాతంత్ర్యం పొందిన 75 సంవత్సరాల వేడుకలను ఘనంగా జరుపుకున్నది.
విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఉన్న పరిటాల గ్రామం, భారత స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో తన సార్వభౌమాధికారాన్ని మొదటిసారిగా ప్రకటించింది. హైదరాబాద్ నిజాం నవాబు పరిపాలించిన సమయంలో పరిటాల తాలూకాలో ఏడు గ్రామాలు ఉండేవని స్థానికులు గుర్తు చేసుకున్నారు. ఈ ప్రాంతంలో విలువైన వజ్రాలు ఉండేవి. అయితే, నిజాం ప్రతినిధులు ఇక్కడి అన్ని సంపదలను తీసుకువెళ్లారని అప్పటివారు తమ జ్ఞాపకాలను నెమరేసుకున్నారు.
మహాత్మా గాంధీ స్వాతంత్ర్య ఉద్యమాన్ని ప్రారంభించిన తర్వాత మల్లికార్జునరావు నేతృత్వంలో 1947 నవంబర్ 12న పోలీస్ స్టేషన్పై దాడి చేశారు. ఈ తిరుగుబాటు దాడులు కొనసాగుతుండగానే 1947 నవంబర్ 15 న మాదిరాజు దేవరాజ్ నాయకత్వంలో పరిటాల స్వతంత్ర గణతంత్ర రాజ్యంగా ప్రకటించుకుని జాతీయ జెండాను ఎగురవేశారు. ఆ సమయంలో పరిటాల నుంచి జయప్రకాష్ నారాయణ్, ఎన్జీ రంగా, ప్రకాశం పంతులు, స్వామి రామానంద తీర్థ, కాకాని వెంకటరత్నం వంటి అనేకమంది జాతీయ నాయకులు ఉద్యమంలో పాల్గొన్నారు. చివరకు 1948 సెప్టెంబర్ 17న నిజాం పాలన ముగిసింది. తొలి గణతంత్ర ఆంధ్రప్రదేశ్ గురించి భావి తరాలకు అవగాహన కల్పించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పరిటాల గ్రామస్థులు కోరారు.