అమరావతి : రాజమహేంద్రవరం వద్ద గోదావరికి వరద ఉధృతి పెరుగుతుంది. దీంతో ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ప్రస్తుతం బ్యారేజ్ వద్ద 12.10 అడుగుల వరకు నీటి మట్టం కొనసాగుతుంది. బ్యారేజ్ నుంచి సముద్రంలోకి 10.27 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
విజయనగరం జిల్లాలోని భోగాపురం మండలం ముక్కాం వద్ద సముద్రంలో అల్లకల్లోలం నెలకొని ఉన్నది. తీరంలో ఐదు మీటర్ల ఎత్తున కెరటాలు ఎగిసిపడుతున్నాయి. సుమారు 150 మీటర్లు ముందుకు చొచ్చుకుని కెరటాలు వస్తున్నాయని తీర ప్రాంత వాసులు తెలిపారు. ఇప్పటికే తీరప్రాంతాల రోడ్లు, రెండు రచ్చబండలు కొట్టుకుపోయాయని తెలిపారు. హుద్హుద్ తర్వాత అంతస్థాయిలో అలలు విరుచుకుపడుతున్నాయి.
మరోవైపు శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో ఏపీ నీటిపారుదలశాఖ అధికారులు ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. స్పిల్వే ద్వారా 2.77 లక్షల క్యూసెక్కుల నీటిని సాగర్కు విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేశుల నుంచి శ్రీశైలానికి 3.64 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తుందని అధికారులు వివరించారు. శ్రీశైలం జలాశయం నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం నీటిమట్టం 884.30 అడుగులుగా ఉంది. జలాశయం నీటి మట్టం 215.80 టీఎంసీలకు గాను 211.47 టీఎంసీల వరకు నీరు నిల్వ ఉంది.