తిరుపతి: ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా గూడూరులో పెను ప్రమాదం తప్పింది. గూడూరు జంక్షన్ సమీపంలో రైల్లో మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. అయితే రైల్వే సిబ్బంది అప్రమత్తమవడంతో భారీ ప్రమాదం తప్పింది.
అహ్మదాబాద్ నుంచి చెన్నై వెళ్తున్న నవజీవన్ ఎక్స్ప్రెస్ రైలు గూడూరు జంక్షన్ వద్దకు చేరుకోగానే మంటలు చెలరేగాయి. రైల్లోని ప్యాంట్రీ కార్లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన అధికారులు రైలును గూడూరు రైల్వే స్టేషన్లో నిలిపివేశారు. వెంటనే అగ్నిమాపక, రైల్వే సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే అప్పటికే బోగీ సగం కాలిపోయింది. అగ్నిప్రమాదం కారణంగా సుమారు గంట పాటు గూడూరు రైల్వే స్టేషన్లోనే ఎక్స్ప్రెస్ నిలిచిపోయింది. కాగా, ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. బోగీలో మంటలు చెలరేగడానికి కారణాలపై ఆరా తీస్తున్నారు.