అమరావతి : అనకాపల్లిలోని పరవాడ ఫార్మాసిటీలో సోమవారం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. లారస్ ల్యాబ్లోని మూడో యూనిట్లో షార్ట్ సర్క్యూట్ జరిగింది. దీంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ప్రమాదంలో ఐదుగురు కార్మికులు తీవ్ర గాయాలకు గురై మృతి చెందారు. పలువురు గాయపడగా.. ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని.. మంటలు అదుపులోకి తీసుకువచ్చారు.
కాగా, గాయపడిన వారిని చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. మృతులను బీ రాంబాబు, రాజేశ్ బాబు, రామకృష్ణ, మజ్జి వెంకటరావు, సతీశ్గా గుర్తించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం కేజీహెచ్ మార్చురీకి తరలించారు. ఉత్పత్తి లేని బ్లాక్ శుభ్రం చేస్తున్న సందర్భంలో రియాక్టర్ నుంచి మంటలు వచ్చి ప్రమాదం జరిగిందని కార్మికులు పేర్కొంటుండగా.. రియాక్టర్ నుంచి మంటలు రావడంతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.