అమరావతి: ఏపీ సినిమా టిక్కెట్ల విషయంలో టాలీవుడ్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా సమస్యలు ఉన్నాయని, టిక్కెట్ రేట్ల విషయం చాలా చిన్నదని అన్నారు. ఇంతకు ముందు తక్కువ ధరలకు టిక్కెట్లు విక్రయించేవారని, ఈ కారణంగా పన్నులు కూడా కట్టేవారు కాదని అన్నారు. ఇప్పుడు సినిమా టికెట్ ధరలు పెంచితే పన్నులు చెల్లించేందుకు ముందుకు వస్తారని అన్నారు. భారీ బడ్జెట్ సినిమాల టిక్కెట్ రేట్లు పెంచాలని కోరడం సరికాదని, అయితే, మొత్తం పరిశ్రమ గురించి ప్రభుత్వంతో మాట్లాడాలని నిర్మాత వాటాదారులను కోరారు.
తెలుగు సినీ పరిశ్రమ సమస్యలను త్వరగా పరిష్కరించాలని తమ్మారెడ్డి భరద్వాజ సీఎం జగన్ను కోరారు. ఈసారి చిరంజీవితో పాటు ఛాంబర్ సభ్యులను పిలిస్తే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న నంది అవార్డుల విషయాన్ని కూడా పరిష్కరించాలని తమ్మారెడ్డి భరద్వాజ కోరారు. కాగా, సినిమా టిక్కెట్ ధరలపై చర్చించేందుకు చిరంజీవి నేతృత్వంలోని బృందం గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలవనుంది.
టిక్కెట్ ధరలపై అధ్యయనం చేసేందుకు ఏర్పాటైన కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించి ధరల పెంపునకు సిఫారసు చేసినట్లు సమాచారం. ఈ భేటీ తర్వాత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి.