తిరుపతి : తిరుపతి ( Tirupati )లోని గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలను ఫిబ్రవరి 17 నుంచి 23వ తేదీ వరకు ఏడు రోజుల పాటు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ (TTD) అధికారులు తెలిపారు. ప్రతి రోజూ సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు స్వామివారు దేవేరులతో కలిసి తెప్పపై విహరించి భక్తులకు దర్శనమివ్వ నున్నారని వెల్లడించారు. అనంతరం ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారని చెప్పారు.
మొదటి రోజున కోదండరామస్వామివారు, ఫిబ్రవరి 18న పార్థసారథిస్వామి, 19న కల్యాణ వేంకటేశ్వరస్వామి, 20న ఆండాళ్ అమ్మవారితో కలిసి శ్రీకృష్ణస్వామి, 21, 22, 23వ తేదీల్లో గోవిందరాజస్వామి తెప్పపై విహరించి దర్శనమిస్తారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజనలు, హరికథ, సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నామని తెలిపారు.