అమరావతి : కడప జిల్లా రాజంపేట మండలంలో వరద నీటిలో చిక్కుకుని మృతి చెందిన ఆర్టీసీ కండక్టర్ కుటుంబానికి ఏపీ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు సంస్థ తరుఫున రూ.50లక్షల పరిహారాన్ని ప్రకటించారు. రాజంపేట వరదలో మూడు బస్సులు చిక్కుకు పోగా వాటిలో రెండు బస్సులోని ప్రయాణికులు సురక్షితంగా బయట పడ్డారు. ఒక బస్సులోని కండక్టర్తో పాటు మరో ముగ్గురు మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఆర్టీసీ ఎండీ శనివారం కడప జిల్లాలో పర్యటించి బస్టాండ్, గ్యారేజ్ను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా ఏపీ మొత్తం 1800 బస్సు సర్వీసులను రద్దు చేశామని వెల్లడించారు. రాజంపేట దుర్ఘటన దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. కండక్టర్ కుటుంబంతో పాటు ప్రయాణికుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేస్తామని ఆయన వెల్లడించారు.