అమలాపురం: ఆంధ్రప్రదేశ్లోని అమలాపురం జిల్లాకు చెందిన మహిళలు నకిలీ వీసా ఏజెంట్ల బారిన పడ్డారు. నకలీ వీసా మోసానికి గురైన పలువురు మహిళలు కేరళలో పట్టుబడి జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఇలా మోసపోయి జైలుకు పోయిన ఐదుగురిని మానవ హక్కుల సంఘాల ప్రతినిధుల పోరాటం కారణంగా బయటకు రాగా.. మరో ముగ్గురు ఇంకా జైలులోనే మగ్గుతున్నారు. ఈ తరహాలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన దాదాపు 30 మంది మహిళలు మోసపోయినట్లుగా తెలుస్తున్నది. గల్ఫ్ దేశాల్లో మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పి మహిళల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసిన ఏజెంట్లు.. నకిలీ వీసాలతో విమానాల్లో ఎక్కిస్తున్నారు. ఇటీవల కొచ్చి విమానాశ్రయంలోని ఇమ్మిగ్రేషన్ సిబ్బంది పలువురు మహిళల పాస్పోర్ట్లను తనిఖీ చేసినప్పుడు ఈ నకిలీ వీసాల రాకెట్ బాగోతం వెలుగులోకి వచ్చింది.
ఉప్పలగుప్తం మండలం కూనవరం గ్రామానికి చెందిన రాంబాబు అనే వ్యక్తి గల్ఫ్ ఏజెంట్గా వ్యవహరిస్తున్నాడు. అమాయకులపై వల విసురుతూ తన మాయమాటలతో ఉచ్చులోకి దింపుతాడు. గల్ఫ్లో ఉపాధి పొంది ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చునన్న ఆశతో ఈ ఏజెంట్ చెప్పినంత మొత్తం సమర్పించుకున్నారు. ఇతగాడి ద్వారా దాదాపు 30 మంది గత మే నెలలో గల్ఫ్కు బయల్దేరారు. వారికి తన వీసాలు ఇచ్చి గల్ఫ్కని చెపి తొలుత హైదరాబాద్ పంపించాడు. అక్కడి నుంచి వారిని మరో వ్యక్తి కేరళలోని కొచ్చి ఎయిర్పోర్టుకు తీసుకొచ్చారు. వీరిని ఇమ్మిగ్రేషన్ అధికారులు తనిఖీ చేయగా వీరంతా నకిలీ వీసాలతో వెళ్తున్నట్లు గుర్తించారు. వారిని గత నెల 8 న అరెస్ట్ చేసి జైలుకు పంపారు. వీరిని విడిపించేందుకు మానవ హక్కుల సంఘం రంగంలోకి దిగి ఐదుగురుకి బెయిల్ ఇప్పించగలిగారు.
ఈ నకిలీ వీసాల విషయాన్ని అమలాపురం జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా దృష్టికి తీసుకెళ్లగా.. ఏజెంట్పై చర్యలు తీసుకునేందుకు కలెక్టర్, జిల్లా ఎస్పీ వేగంగా స్పందించారు. ఈ మేరకు కేరళ జైలులో మగ్గుతున్న ఏపీకి చెందిన మహిళల్ని విడిపించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కేరళ జైలులో మగ్గుతున్నవారిలో గోదావరి జిల్లాలకు చెందినవారే అధిక సంఖ్యలో ఉన్నారు. ఏడాది కాలంగా వీరు అక్కడి జైల్లో ఉంటున్నారు. అమలాపురానికి చెందిన ఐదుగురు మహిళలు శ్రీలక్ష్మి (రావులపాలెం), పార్వతి (అల్లవరం మండలం దేవగుప్తం), జానకి (రామచంద్రపురం), మంగాదేవి (యానాం), సౌజన్య (ఏలూరు) నకిలీ వీసా కేసులో కొచ్చి జైలు నుంచి విడుదలయ్యారు. కేరళ రాష్ట్ర జైలులో మరికొందరు మహిళలు ఉన్నట్లు సమాచారం. జైలులో ఉన్న మహిళల బంధువులు అమలాపురం కలెక్టర్ హిమాన్షు శుక్లాను ఆశ్రయించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఎస్పీ సుధీర్కుమార్రెడ్డి జిల్లాకు చెందిన ముగ్గురు మహిళలను విడుదల చేసేందుకు పోలీసు బృందాన్ని కేరళకు పంపారు.