అమరావతి : సైబర్ నేరగాళ్లు ఆకాశమే హద్దుగా రెచ్చిపోతున్నారు. సాధారణ ప్రజల నుంచి పోలీసు ఉన్నతాధికారుల వరకు వారి వారి పేరిట నకిలీ ఖాతాలను సృష్టించి డబ్బులు వసూలు చేస్తున్నారు. తాజాగా ఏపీకి చెందిన ఓ ఉన్నతాధికారి ఖాతాను తయారు చేయడంతో స్పందించిన అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఏపీఎస్ఆర్టీసీ(APS RTC) కి చెందిన మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమలరావు(Tirumala Rao) పేరిట నకిలీ ఫేస్బుక్(Face book) ఖాతాను సైబర్ నేరగాళ్లు ఓపెన్ చేశారు . పోలీస్ యూనిఫాంలో ఉన్న ఫొటోతో ఖాతా తెరిచిన విషయాన్ని తెలుసుకున్న ఆర్టీసీ ఎండీ వెంటనే విజయవాడ సైబర్ క్రైమ్ (Cyber Crime) పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
తన పేరిట ఉన్న నకిలీ ఫేస్బుక్ ఖాతాకు ఎవరూ కూడా స్పందించవద్దని ఆయన సూచించారు. తన పేరిట ఫేస్బుక్ సహా సామాజిక మాధ్యమాల్లో ఖాతాలు లేవని స్పష్టం చేశారు.