తిరుమల : తిరుమల (Tirumala) శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాలకు ( Vaikuntha Dwara Darshan ) వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విస్తృత ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి ( Venkaiah Chowdary) తెలిపారు. శనివారం తిరుమలలోని శిలా తోరణం వద్ద దర్శన క్యూలైన్లను అధికారులతో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు.
క్యూలైన్లలో ఏర్పాటు చేసిన తాగునీటి కొళాయిలు, అన్న ప్రసాదం పంపిణీ, మరుగుదొడ్ల సౌకర్యాలను పరిశీలించి భక్తులతో మాట్లాడి అభిప్రాయాలు తెలుసుకున్నారు. అనంతరం అదనపు ఈవో మీడియాతో మాట్లాడుతూ వైకుంఠ ద్వార దర్శనాలు పురస్కరించుకుని ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశామని చెప్పారు. భక్తుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని క్యూలైన్లలో పలు మార్పులు చేపట్టామని తెలిపారు. క్యూలైన్లలో భక్తులు కూర్చునేవిధంగా ఏర్పాట్లు చేయడంతో పాటు, తాగునీటి సౌకర్యం, క్యూలైన్లకు అనుసంధానంగా అదనపు మరుగుదొడ్లు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు చెప్పారు.
భక్తుల కొరకు మొబైల్ వాటర్ డ్రమ్స్, మొబైల్ ఫుడ్ వ్యాన్లు

చలికాలం కావడంతో క్యూలైన్లలోని అన్న ప్రసాదాల పంపిణీ కేంద్రాల్లో అన్న ప్రసాదాలు చల్లబడకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకునే ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. అదేవిధంగా భక్తులకు తాగునీరు అందించేందుకు అదనంగా మొబైల్ వాటర్ డ్రమ్స్, మూడు మొబైల్ ఫుడ్ వ్యాన్లు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. భక్తుల కోసం టీటీడీ అందుబాటులో ఉంచిన సదుపాయాలను వినియోగించుకునేందుకు వివిధ భాషల్లో సూచిక బోర్డులను కూడా క్యూలైన్లలో, ముఖ్యమైన ప్రాంతాల్లో ఏర్పాటు చేశామన్నారు.
ఎస్ఎస్డీ టోకెన్లు రద్దు
వైకుంఠ ద్వార దర్శనాలను పురస్కరించుకుని డిసెంబర్ 28 నుంచి జనవరి 7వరకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ లో భక్తులకు ఇచ్చే ఎస్ఎస్డీ ( SSD ) టోకెన్ల జారీని రద్దు చేశామని అదనపు ఈవో తెలిపారు.
ఈ తనిఖీల్లో అదనపు ఈవో వెంట శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, అన్న ప్రసాద విభాగం డిప్యూటీ ఈవో రాజేంద్ర, హెల్త్ డిప్యూటీ ఈవో సోమన్నారాయణ, ఈఈ శ్రీనివాసులు, డిఈ చంద్రశేఖర్, ఐటీ డిప్యూటీ జీఎం వెంకటేశ్వర్లు నాయుడు, అశ్వని ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటసుబ్బారెడ్డి, పలువురు విజిలెన్స్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.