తిరుమల : తిరుమలలో గదుల కేటాయింపు వ్యవస్థను త్వరలో తిరుపతి నుంచి ప్రయోగాత్మకంగా చేపట్టనున్నట్లు టీటీడీ ఈఓ ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. టీటీడీ అధికారులు, సిబ్బంది, భక్తుల కారణంగా సాలకట్ల బ్రహ్మోత్సవాలు విజయవంతమయ్యాయని చెప్పారు. ఈ నెల 11 న హైదరాబాద్లో, డిసెంబర్ నెలలో ప్రకాశం జిల్లాతో పాటు న్యూఢిల్లీలో స్వామి వారి వైభవోత్సవాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. తిరుమల అన్నమయ్య భవనంలో డయల్ యువర్ ఈఓ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా టీటీడీ చేపట్టిన పలు కార్యక్రమాల గురించి భక్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో జేఈఓలు శ్రీమతి సదా భార్గవి, వీరబ్రహ్మం, సీవీఎస్ఓ నరసింహ కిషోర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీలోని అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది, జిల్లా యంత్రాంగం, పోలీసులు, శ్రీవారి సేవకుల సమష్టి కృషి, భక్తుల సహకారంతో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు విజయవంతం అయ్యాయని ధర్మారెడ్డి చెప్పారు. ఈ సందర్భంగా తిరుమలలో నిర్మించిన పరకామణి భవనం, వీపీఆర్ గెస్ట్ హౌస్ ప్రారంభించినట్లు తెలిపారు. గరుడ సేవ రోజున దాదాపు 3 లక్షల మంది భక్తులకు పైగా వాహనసేవ దర్శనభాగ్యం కల్పించామన్నారు. తిరుమలలోని గదుల కేటాయింపు వ్యవస్థను తిరుపతిలో చేపట్టాలని నిర్ణయించినట్లు చెప్పారు. తద్వారా తిరుమలలో గదులు దొరకని భక్తులు తిరుపతిలో వసతి పొందే అవకాశం ఉంటుందన్నారు. శ్రీవారి దర్శనార్థం కంపార్ట్మెంట్లలో రాత్రి వేళ వేచి ఉండే సామాన్య భక్తులకు ఉదయం త్వరగా దర్శనం కల్పించేందుకు వీలుగా ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయాన్ని ఉదయం 10 గంటలకు మార్పు చేసి ప్రయోగాత్మకంగా అమలుచేస్తామని చెప్పారు.
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారికి జరిగే నిత్య, వారసేవలు, ఉత్సవాలను ఇతర ప్రాంతాల్లోని భక్తులు దర్శించేందుకు వీలుగా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలు నిర్వహిస్తున్నామని ధర్మారెడ్డి వెల్లడించారు. ఇందులో భాగంగా అక్టోబరు 11 నుండి 15వ తేదీ వరకు హైదరాబాద్ ఎన్టిఆర్ స్టేడియంలో ఈ ఉత్సవాలు జరుగనున్నాయని, అక్టోబరు 11న వసంతోత్సవం, 12న సహస్ర కలశాభిషేకం, 13న తిరుప్పావడ, 14న నిజపాద దర్శనం, 15న సాయంత్రం 6.30 నుండి 8.30 గంటల వరకు శ్రీనివాస కల్యాణం జరుగుతాయన్నారు. అలాగే, డిసెంబరులో ప్రకాశం జిల్లా ఒంగోలు, జనవరిలో ఢిల్లీలో శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలు నిర్వహిస్తామని చెప్పారు. అక్టోబరు నెలలో ఏజన్సీ ప్రాంతాలైన అనకాపల్లి, అరకు, రంపచోడవరం తదితర ప్రాంతాల్లో కూడా శ్రీనివాస కల్యాణాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.