తిరుపతి : తిరుమలతో పాటు పరిసర ప్రాంతాల్లో ప్రకృతి విపత్తులు సంభవించినపుడు తక్షణమే చర్యలు చేపట్టేందుకు వీలుగా విపత్తుల నిర్వహణ కరదీపిక(మాన్యువల్) రూపొందిస్తున్నట్టు టీటీడీ జేఈవో సదా భార్గవి(ఆరోగ్యం మరియు విద్య) తెలిపారు. తిరుపతిలోని శ్వేత భవనంలో బుధవారం అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ఇటీవల భారీ వర్షాల కారణంగా సంభవించిన వరదల నేపథ్యంలో విపత్తుల నిర్వహణకు తగిన మార్గదర్శకాలు రూపొందించాలని ఆదేశాల ఈవో మేరకు అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పాటైందని ఆమె వెల్లడించారు.
ఇందులో జేఈవో తోపాటు, సీవీఎస్వో గోపినాథ్ జెట్టి, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, డీఎఫ్వో శ్రీనివాసులురెడ్డి సభ్యులుగా ఉంటారని పేర్కొన్నారు. విపత్తుల నివారణ కోసం మాన్యువల్ తయారీని తాను పర్యవేక్షిస్తున్నానని, ఇందుకోసం వర్కింగ్ గ్రూపు ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ గ్రూపులోని ఇంజినీరింగ్, ఫారెస్టు, ఐటీ, ఎలక్ట్రికల్, సెక్యూరిటీ, హెల్త్ విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా కంట్రోల్ రూమ్ ప్రారంభం, ముందస్తు హెచ్చరికలు చేసే యంత్రాంగంపై సమీక్ష నిర్వహించామన్నారు.