Srisailam Temple | జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో ఏప్రిల్ 6 నుంచి 10వ తేదీ వరకు ఉగాది మహోత్సవాలు జరుగనున్నాయి. ఐదురోజుల పాటు ఘనంగా నిర్వహించేందుకు దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. ఈ క్రమంలో ఉత్సవాల ఏర్పాట్లపై ఆలయ పరిపాలన భవనంలో ఈవో పెద్దిరాజు సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలన్నారు. ఉత్సవాల్లో స్వామి, అమ్మవార్లకు జరిగే కైంకర్యాలన్నీ ఎలాంటి లోపం లేకుండా పరిపూర్ణంగా జరగాలని ఆదేశించారు. పూజా కార్యక్రామాలన్నీ నిర్దేశిత సమయానికి ప్రారంభించాలని ఆదేశించారు.
ఉత్సవాలకు వెంకటాపురం, నాగలూటి, దామెర్లకుంట, పెద్దచెరువు, మఠంబావి, భీమునికొలను, కైలాసద్వారం మీదుగా క్షేత్రానికి భక్తులు వస్తారని.. ఆయా మార్గంలో ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా నీటి సరఫరాకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఇంజినీరింగ్ విభాగాన్ని ఆదేశించారు. ఆలయ క్యూలైన్లలో మంచినీరు, మజ్జిగ, బిస్కెట్లు, అల్పహారం అందించాలని ఆదేశించారు. ఎండతీవ్రత కారణంగా క్యూకాంప్లెక్స్లో అవసరం మేరకు కూలర్లను ఏర్పాటు చేయాలన్నారు. ఉత్సవాలకు ఆలయంతో పాటు పరిసరాలన్నీ లైంటింగ్తో అలంకరించాలని సూచించారు. క్షేత్ర పరిధిలో, కైలాస ద్వారం వద్ద జిల్లా వైద్యాశాఖ సహకారంతో తాత్కాలిక వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలన్నారు.