అనంతపురం: జిల్లాలోని కియా కార్ల తయారీ పరిశ్రమోల ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మెకానికల్ ఇంజినీర్ ఒకరు చనిపోగా, మరో కాంట్రాక్ట్ ఉద్యోగి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. మృతుడు తమిళనాడు విల్లుపురానికి చెందిన శంకరపాండ్యన్ అయ్యప్పన్ (32) గా గుర్తించారు. అయ్యప్పన్ హ్యుందాయ్ కంపెనీలో మెకానికల్ ఇంజినీర్గా పనిచేస్తున్నారు. గాయపడిన వ్యక్తి కాంట్రాక్ట్ ఉద్యోగి షాషావలిగా గుర్తించారు. మెరుగైన చికిత్స కోసం షాషావలిని అనంతపురం నుంచి బెంగళూరుకు తరలించారు.
కియా ఇండియా ఫ్యాక్టరీ ప్రాంగణంలోని వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ (డబ్ల్యూటీపీ) ఆపరేషన్, నిర్వహణ కాంట్రాక్టును హ్యుందాయ్ కంపెనీకి కియా కంపెనీ అప్పగించింది. ఇక్కడి రెండు ప్లాంట్ల నిర్వహణ బాధ్యతలను తమ మెకానికల్ ఇంజినీర్ శంకరపాండ్యన్ అయ్యప్పన్కు అప్పగించారు. గురువారం రాత్రి డ్యూటీలో ఉన్న అయ్యప్పన్.. బయట మోటారును ఆన్ చేసి తెల్లవారుజామున 1.30 గంటలకు అధిక స్థాయి మీథేన్, హైడ్రోజన్ సల్ఫైడ్ను పీల్చుకున్నాడు. అనంతరం నీటి స్థాయిని తనిఖీ చేసేందుకు వెళ్లి అపస్మారకంలోకి వెళ్లిపోయాడు.
ఉదయం 6 గంటల సమయంలో వెళ్లిన షాషావలి కూడా ఈ గ్యాస్ పీల్చుకుని పడిపోయాడు. వీరిని గమనించిన సిబ్బంది చికిత్స నిమిత్తం తొలుత పెనుకొండ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అక్కడ అయ్యప్పన్ చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. షాషావలిని మెరుగైన చికిత్స అందించేందుకు బెంగళూరుకు తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పెరుకొండ డీఎస్పీ రమ్య తెలిపారు. అయితే, గ్యాస్ లీకైన విషయాన్ని ఫిర్యాదులో పేర్కొనలేదని ఆమె స్పష్టం చేశారు.