తిరుపతి : భగవంతుని సేవలో ఉద్యోగులు క్రీడాస్ఫూర్తితో పనిచేసి భక్తులకు మెరుగైన సేవలు అందించాలని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకరరెడ్డి( Chairman Karunakar Reddy) కోరారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం పరేడ్ మైదానంలో ఉద్యోగుల వార్షిక క్రీడాపోటీలను (Annual Sports) ఆయన ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన చైర్మన్ మాట్లాడుతూ టీటీడీ(TTD) ఉద్యోగులకు మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు, క్రీడల పట్ల ఆసక్తిని పెంచేందుకు ప్రతి సంవత్సరం క్రీడాపోటీలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. క్రీడలతో శారీరక దారుఢ్యంతోపాటు పునరుత్తేజం కలుగుతుందని చెప్పారు. ఉద్యోగులకు క్రీడల పట్ల ఉన్న శ్రద్ధను గమనించి ఇండోర్ స్టేడియం (Indore Stadium) నిర్మాణానికి తమ బోర్డు రూ.10 కోట్లు కేటాయించినట్టు తెలిపారు.
ఈవో ఏవి.ధర్మారెడ్డి ఉద్యోగులతో క్రీడాప్రతిజ్ఞ చేయించగా చైర్మన్ క్రీడాపతాకాన్ని ఆవిష్కరించారు. టగ్ ఆఫ్ వార్, చెస్, వాలీబాల్, క్యారమ్స్, బాల్ బ్యాడ్మింటన్, ఫుట్బాల్, టేబుల్ టెన్నిస్, క్రికెట్, షటిల్, టెన్నిస్ తదితర క్రీడలను నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు.