Kidney racket | హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లాలో కిడ్నీ రాకెట్ కలకలం రేపింది. సామాన్య మధ్యతరగతి కుటుంబాలే టార్గెట్గా ముఠా దందా నడుపుతోంది. ఆధార్ కార్డులో పేరు మార్చుకొని వ్యాపారం సాగిస్తున్నారు. బాధితుల వద్ద నుంచి రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు చెల్లించి కిడ్నీలను కొనుగోలు చేస్తున్నారు. ఆర్థిక కష్టాల్లో ఉన్నవారికి డబ్బు ఆశచూపి కిడ్నీలు కొనుగోలు చేసి, ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారు.
లావాదేవీల్లో తేడాలు వచ్చి అమాయకులు మోసపోతున్నారు. ఏలూరులో బూసి అనురాధ అనే మహిళ కిడ్నీ ముఠా వలలో పడింది. ఒక కిడ్నీకి ఏడు లక్షలు ఇస్తామన్న ముఠా.. సర్జరీ తర్వాత నాలుగు లక్షలే ఇచ్చింది. గత ఏడాది ఫిబ్రవరిలో ఒక దవాఖానలో సర్జరీ జరగ్గా, అప్పటి నుంచి మిగతా డబ్బు ఇస్తారని బాధితురాలు ఎదురుచూసింది. అయితే, మిగతా డబ్బుతో బ్రోకర్ ప్రసాద్ పరారయ్యాడు. దీంతో బాధితురాలు అనురాధ ఏలూరు వన్టాన్ పోలీసులను ఆశ్రయించింది. ముఠా వలలో పడి మోసపోయిన బాధితులు మరికొందరు ఉన్నారు.