అమరావతి : తిరుపతి జిల్లాలో ఓ బాలుడికి ప్రాణాపాయం తప్పింది. ఫార్మాసిస్ట్ బదులు సెక్యూరిటీ గార్డు ఇచ్చిన మందును వాడడంతో ఓ బాలుడు తీవ్ర అస్వస్థతకు గురైన ఘటన పుత్తూరు ఆస్పత్రిలో చోటు చేసుకుంది. గేటు పుత్తూరులోని శెంగుంధర్ వీధికి చెందిన రోహిత్ అనే బాలుడు జలుబు, దగ్గుతో బాధపడుతుండడంతో అతడి తండ్రి రాజ్కుమార్ ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్లకు చూపించాడు.
పరీక్షించిన వైద్యుడు సిరప్ రాసిచ్చాడు. ఆ చీటీతో ఫార్మాసిస్ట్ వద్దకు వెళ్లగా ఆ సమయంలో ఆయన అక్కడ లేకపోవడంతో సెక్యూరిటీ గార్డు ఇచ్చిన మందును తాగాడు. కొద్దిసేపటికే కడుపులో మంటగా ఉందని బాలుడు రోధించడంతో అతడిని మరోసారి వైద్యుడికి చూయించాడు. పరీక్షించిన వైద్యుడు రాసిచ్చిన చీటీని, తీసుకొచ్చిన మందు వేర్వేరుగా ఉండడంతో వాకాబు చేశాడు. దీంతో ఫార్మసిస్ట్ సెలవులో ఉండడంతో అతడి బదులు సెక్యూరిటీ గార్డు ఇచ్చినట్లు గుర్తించి అస్వస్థతకు గురైన బాలుడికి మెరుగైన చికిత్స కోసం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు.
ఘటనపై డీసీహెచ్ఎస్ వేదసాయి విచారణ జరిపి అవుట్ సోర్సింగ్ సెక్యూరిటీ గార్డ్ వసంత్ను విధుల నుంచి తొలగించారు. ప్రస్తుతం బాలుడు కోలుకుంటున్నాడని ఆమె వెల్లడించారు.