హైదరాబాద్ : మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైల క్షేత్రంలో మార్చి 1 నుంచి 11వ తేదీ వరకు నిర్వహించనున్న బ్రహ్మోత్సవాల (Brahmotsavam) సందర్భంగా పలు సేవలను రద్దు చేసినట్లు ఈవో పెద్దిరాజు(EO Peddiraju) వెల్లడించారు. ఆ రోజుల్లో అన్ని ఆర్జిత సేవలు, స్పర్శ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. బ్రహ్మోత్సవాలకు వేలాదిగా భక్తులు తరలివచ్చే అవకాశమున్నందును స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఉంటుందని పేర్కొన్నారు.
మహాశివరాత్రి (Mahashivratri) బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్నట్లు వివరించారు. శివస్వాములకు మాత్రం 1వ తేదీ నుంచి 5వ తేదీ సాయంత్రం వరకు నిర్దిష్ట వేళ్లలో ఉచిత స్పర్శ దర్శనానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. 5న రాత్రి 7.30 గంటల నుంచి 11 గంటలకు వరకు భక్తులకు స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఉంటుందని వెల్లడించారు.
బ్రహ్మోత్సవాలలో భక్తులకు ఉచిత దర్శనంతో పాటు శీఘ్ర, అతి శీఘ్ర దర్శనానికి ఆన్లైన్, కరెంట్ బుకింగ్కు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామివారిని ఇది వరకు వెండి రథంలోనే ఊరేగింపు ఉత్సవాలు నిర్వహించామని అన్నారు. ఇటీవల నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి స్వామి రూ.11 కోట్ల విలువ చేసే బంగారు రథాన్ని అందించగా ఇకపై స్వామి అమ్మవార్ల ఉత్సవాలను బంగారు రథంపై నిర్వహించనున్నామని తెలిపారు.