హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ) : విశాఖ తీరంలో అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా గుట్టు రట్టయింది. బ్రెజిల్ నుంచి విశాఖలోని ఓ ప్రైవేటు ఆక్వా ఎక్స్పోర్ట్స్కు వచ్చిన కంటైనర్లో 25 వేల కిలోల మత్తుపదార్థాలు ఉన్నట్టు సీఐబీ అధికారులు గుర్తించారు. సమాచారం మేరకు ఢిల్లీ సీబీఐ అధికారులు.. విశాఖలోని సీబీఐ, కస్టమ్స్ అధికారులను అప్రమత్తం చేశారు. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు. ఆ కంటైనర్ను పట్టుకొన్నారు.
ఆపరేషన్ గరుడలో భాగంగా అధికారుల బృందం ఈ భారీ ఎత్తున డ్రగ్స్ను సీజ్ చేసింది. విశాఖలోని కన్సిగ్సీ పేరుతో ఓ ప్రైవేటు కంపెనీకి 25కిలోల చొప్పున 1000 బ్యాగుల్లో డ్రగ్స్ నింపి సరఫరా చేసినట్టు తెలుస్తున్నది. జర్మనీలోని హ్యాంబర్గ్ మీదుగా ఈ నెల 16న ఆ కంటైనర్ విశాఖ చేరినట్టు సీబీఐ అధికారులు గుర్తించారు. 19న సీబీఐ బృందం సరకును పరిశీలించింది. అందులో మాదకద్రవ్యాలు ఉన్నట్టు తెలుసుకొని.. పరీక్షకు తీసుకెళ్లినట్టు తెలిసింది. బ్రెజిల్ అడ్రస్, ఇకడి విశాఖ ప్రైవేటు కంపెనీ కన్సిగ్సీ పేరు ఆధారంగా సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు.