Pawan Kalyan | వైసీపీ గూండాయిజాన్ని చూసి భయపడకండని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజలకు సూచించారు. ప్రజలపై దాడి చేస్తే మక్కీలు ఇరగ్గొట్టి మడత మంచంలో పడేస్తానని హెచ్చరించారు. తాడేపల్లిగూడెంలో బుధవారం నిర్వహించిన జనసేన-టీడీపీ భారీ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ఆవేశపూరితంగా మాట్లాడారు. వ్యక్తి ప్రయోజనం ఆశించి రాజకీయం చేయనని.. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే రాజకీయాలు చేస్తానని అన్నారు. తాను తీసుకునే ప్రతి నిర్ణయం రాష్ట్ర ప్రయోజనాల కోసమే అని స్పష్టం చేశారు.
ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్లో శాంతి, మంచితనం మాత్రమే చూశారని.. ఇకపై జగన్కు యుద్ధం అంటే ఏంటో చూపిస్తానని జనసేనాని విరుచుకుపడ్డారు. జగన్ పాలనలో రాజధాని అంటే మూడు చోట్లకు పరుగెత్తాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. దోపిడీకి గురైన ఆంధ్రాగా మారిపోయిందని మండిపడ్డారు. అదే చంద్రబాబు నవ నగరాన్ని నిర్మించిన వ్యక్తి అని కొనియాడారు. చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి కావాలనే పొత్తు పెట్టుకున్నట్లుగా వివరించారు. కోట్లు సంపాదించుకునే మార్గాలు వదిలి జనం కోసం వచ్చానని స్పష్టం చేశారు. పొత్తులో భాగంగా 24 సీట్లు తీసుకుంటే ఇంతేనా అని చాలామంది ప్రశ్నిస్తున్నారని చెప్పారు. గత ఎన్నికల్లో జనసేన ఒక్క సీటు గెలిస్తేనే వైసీపీ నేతలు రాత్రికి రాత్రే రాజమండ్రిలో రోడ్లు వేశారని.. అదే 24 సీట్లు గెలిస్తే ఇంకా ఎంత ఉంటుందో ఆలోచించాలని సూచించారు. జగన్ను అధఃపాతాళానికి తొక్కకపోతే తన పేరు పవన్ కళ్యాణే కాదని అన్నారు. వ్యూహాలు రచిస్తామని.. జగన్ కోటలు బద్ధలు కొడతామని స్పష్టం చేశారు.
సలహాలు, సూచనలు ఇచ్చేవారు తమకు అక్కర్లేదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. యుద్ధం చేసే వారు తనకు కావాలని అన్నారు. పదేళ్లుగా అవమానాలే ఎదుర్కొన్నానని.. ఎక్కడో కూర్చొని ప్రశ్నించకండి.. మద్దతివ్వండి అని విజ్ఞప్తి చేశారు. తనను ప్రశ్నించడం కాదని.. తనతో నడవాలని కోరారు. తనతో నడిచేవాళ్లే తన వాళ్లని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ అంటే ఆంధ్రా ప్రజల భవిష్యత్తు అని అన్నారు. పవన్తో స్నేహమంటే పవన్ చచ్చేదాకా అని.. అదే శతృత్వం అంటే అవతలి వ్యక్తి చచ్చేదాకా అని ఆవేశంగా చెప్పుకొచ్చారు. జగన్ వెంట ఉన్నది భజన బృందం అని ఎద్దేవా చేశారు.