తాడేపల్లి : పేదల విద్యకు అడ్డంకులు సృష్టించవద్దని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సూచించారు. పేద విద్యార్థులు చదువుకోవద్దనేది చంద్రబాబు లక్ష్యమని, వారి చదువులకు ఆయన ప్రధాన అడ్డంకిగా మారారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు తన హయాంలో ప్రభుత్వ స్కూళ్లను చలకనగా చూసి.. కార్పొరేట్ స్కూళ్లకు కొమ్ముకాయడం వల్లనే ఇప్పుడీ పరిస్థితి నెలకొన్నదని విమర్శించారు. నిరుపేద చిన్నారులకు నాణ్యమైన విద్యనందించేందుకు సీఎం జగన్ కృషి చేస్తుంటే.. టీడీపీ నేతలమో అడ్డంకులు సృష్టిస్తున్నారని విరుచుకుపడ్డారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు.
ధనవంతులకు అందుబాటులో ఉన్న ‘ఎడ్యు టెక్’ను ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకూ అందించాలనే ఉద్దేశంతో బైజూస్తో ఒప్పందం చేసుకున్నట్లు మంత్రి సురేష్ చెప్పారు. ఇది ప్రభుత్వ విద్యలో ఒక గేమ్ చేంజర్ అని.. ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు గొప్ప అవకాశమన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు అన్నిరకాల అవకాశాలు అందుబాటులోకి రావాలని సీఎం జగన్ నిత్యం పరితపిస్తుంటారని ఆయన చెప్పారు. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం విద్యాను ప్రవేశపెట్టి నిరుపేద విద్యార్థులకు భవిష్యత్లో అంతర్జాతీయ అవకాశాలు వచ్చేలా చేస్తుండటం ఎంతో గర్వించదగినదని అన్నారు.
ప్రస్తుతం బైజూస్ కంటెంట్ కొనాలంటే ఒక్కో విద్యార్థి రూ. 20-25 వేల వరకు ఖర్చవుతుందని, అలాంటిది అందరికీ అందుబాటులోకి వచ్చేలా చేయడం చాలా గొప్పవిషయమని చెప్పారు. ఇప్పటి వరకు ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు ఇంగ్లిష్ మీడియం చదువులు వద్దని చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు బైజూస్పైనా తన అక్కసును వెళ్లగక్కుతున్నారని మంత్రి సురేష్ దుయ్యబట్టారు.