Pawan Kalyan | రాష్ట్రంలో అభివృద్ధి దిశగా, సంక్షేమ ఫలాలు అందిస్తూ సుపరిపాలన సాగిస్తున్న ఈ తరుణంలో ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించే విధంగా కుట్రలు మొదలయ్యాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విమర్శించారు. ఇలాంటి కుట్రలకు పాల్పడే వారి పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అమరావతిలోని జనసేన కార్యాలయంలో పార్టీ శ్రేణులతో శనివారం సమావేశమైన పవన్ కల్యాణ్ వారికి దిశానిర్దేశం చేశారు.
సామాజిక మాధ్యమాల ముసుగులోనో, యూట్యూబ్ చానళ్ల పేరుతోనో, మరో మార్గంలోనో కులాల మధ్య, మతాల మధ్య చిచ్చుపెడుతున్నారని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. ఇలా కుయుక్తులతో సమాజంలో అశాంతి, అభద్రత కలిగించే వ్యక్తుల నైజాన్ని పదేళ్లుగా చూస్తున్నామని.. వారి ఉచ్చులో పడవద్దని అన్నారు. ఆవేశాలకు లోనై, ఘర్షణ వాతావరణానికి తావీయవద్దని సూచించారు. అలా ఆవేశాలు ప్రదర్శిస్తే కుట్రదారులు ఆశించిన ప్రయోజనాలు నెరవేరుతాయని అన్నారు.
‘ ఇటీవల మచిలీపట్నంలో చోటు చేసుకున్న ఘటనలు ఇందుకు ఉదాహరణ. ఒక యూట్యూబ్ చానల్లో ఒక వ్యక్తి అభ్యంతరకర భాష ఉపయోగించి మాట్లాడాడు. అతను ఆ విధంగా మాట్లాడేలా సిద్ధం చేసి, ప్రచారం చేయడం వెనక ఉన్న కుత్సిత ఆలోచనను పసిగట్టాలి. దానిపై చట్ట ప్రకారం కేసులుపెట్టి ముందుకు వెళ్లాలి. తొందరపడి మరో మార్గంలో వెళ్లి ఘర్షణపడటం ద్వారా సమస్య జటిలం అవుతుంది. ప్రజల మధ్య సామరస్య వాతావరణం చెడగొట్టి రెచ్చగొట్టే నాయకులు బయటకు వస్తారు.’ అని పవన్ కల్యాణ్ తెలిపారు.
కులాలు, మతాల మధ్య విభేదాలు తీసుకువచ్చే విధంగా ప్రవర్తించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా ఫిర్యాదు చేయాలని పవన్ కల్యాణ్ సూచించారు. ఈ దిశగా ముందుకు వెళ్లాలని జనసేన నాయకులు, శ్రేణులతోపాటు కూటమి నాయకులకు సూచించారు. సోషల్ మీడియా, యూట్యూబ్ చానళ్ల రూపంలోనో, విశ్లేషకుల ముసుగులోనో రెచ్చగొట్టే వారినీ, అభ్యంతరకర రీతిలో మాట్లాడేవారినీ భారత న్యాయ సంహిత ప్రకారం చట్టం ముందు నిలపాలన్నారు. వీరి వెనక ఉండి వ్యవస్థీకృతంగా రెచ్చగొట్టి కుట్రలు చేసేవారిపైనా ఫిర్యాదు చేసి కేసులు నమోదు చేయించాలన్నారు.
మచిలీపట్నం వివాదంపై పార్టీలో అంతర్గత విచారణ చేయాలని నాయకులకు ఆదేశాలు ఇచ్చానని పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ ఘటనలో పాలుపంచుకున్న వారికి నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని స్పష్టం చేశానని అన్నారు. కుట్రలు చేసేవారి కుత్సిత నైజం కలిగిన పార్టీ, ఆ పార్టీ నాయకుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వారు చేసే దుష్ప్రచారాన్ని ప్రజాస్వామ్యయుతంగా, చట్ట ప్రకారమే తిప్పికొడదామని స్పష్టం చేశారు.