శ్రీశైలం : శ్రీశైల (Srisailam ) మహాక్షేత్రానికి వస్తున్న యాత్రికుల ఇబ్బందులను నేరుగా తెలుసుకునేందుకు డయల్ యువర్ ఈవో (Dial Your EO ) కార్యక్రమాన్ని పున:ప్రారంభిస్తున్నట్లు ఈవో లవన్న ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయశాఖ కమీషనర్ ఆదేశాల మేరకు ప్రతి బుధవారం భక్తులు నేరుగా దేవస్థాన కార్యనిర్వాహణాధికారితో మట్లాడేందుకు వీలు కల్పిస్తున్నట్లు చెప్పారు.
ఉభయ తెలుగు రాష్ట్రాల యాత్రికులే కాకుండా దేశం నలుమూలల నుండి జ్యోతిర్లింగ శక్తిపీఠాన్ని దర్శించుకునేందుకు వస్తున్న వారికి అవసరమైన వసతి ఏర్పాట్లు, ఆర్జితసేవా టిక్కెట్ల కేటాయింపు, దర్శన విధానాలు, విరాళాలు, అన్నప్రసాద వితరణ, ప్రసాదాలు, పబ్లికేషన్స్ విభాగాల సేవల వల్ల భక్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను స్వయంగా తెలుసుకుని సత్వర పరిష్కారం చేసేందుకు చర్యలు తీసుకునేందుకు వీలవుతుందని ఆయన చెప్పారు. అందుకు బుధవారం ఉదయం 12:30 నుండి 01:30 వరకు యాత్రికులు 08524 – 28711 నంబరుకు ఫోన్ చేసి సలహాలు ఫిర్యాదులు తెలపాలని ఈవో లవన్న కోరుతున్నారు.
శ్రీగిరిలో మంగళవార పూజలు..
శ్రీశైల భ్రమరాంబా మల్లికార్జున స్వామివార్ల దేవస్థానంలో లోక క్షేమాన్ని కాంక్షిస్తూ పరివార దేవుళ్లకు ప్రత్యేక పూజాధికాలను నిర్వహించినట్లు ఈవో లవన్న తెలిపారు. ఆలయ ప్రాంగణంలో కొలువైవున్న కుమారస్వామికి మంగళవారం ఉదయం షోడషోపచార పూజాధి క్రతువులు చేశారు. సాయంకాలం క్షేత్రపాలకుడైన బయలు వీరభద్రస్వామికి ప్రదోషకాల పూజలు శాశ్రోక్తంగా జరిపించారు. ఆరుబయట ఆలయంలో భక్తులకు దర్శనమిచ్చే స్వామికి ఉదక స్నానం చేయించి విశేష పుష్పార్చన తీర్ధప్రసాదాలు అందించారు.
అనంతరం సంధ్యా సమయంలో వీరశిరోమండపం వద్ద కొలువైన శనగలబసవన్నకు ప్రత్యేక క్రతువులు నిర్వహించారు. ప్రజలు సుఖసంతోషాలతో బాసిల్లాలని అర్చకపండితులు మహా సంకల్పాన్ని పఠించి పంచామృతాలు ఫలోదకాలతోపాటు మల్లికాగుండంలోని శుద్దజలంతో అభిషేకం చేశారు. అనంతరం నందీశ్వరునిపై స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను అధిష్టింప జేసి పంచసూక్తం వృషభసూక్తం ప్రత్యేక పూజలు చేశారు. నూతన వస్త్రాన్ని సమర్పించి నానబెట్టిన శనగలు నైవేద్యంగా సమర్పించారు.